Andhra Pradesh: రిజిస్ట్రేషన్ చట్టంలోని నిషేధిత జాబితా నుంచి ఆస్తుల తొలగింపు అధికారం ఇకపై కలెక్టర్లకే : కేఈ కృష్ణమూర్తి

  • ఆ అధికారాన్ని కలెక్టర్లకు బదలాయిస్తున్నాం
  • 22- ఏ నిషేధిత జాబితా రూపకల్పన ఇకపై డిజిటల్ ఫార్మాట్ లో
  • కలెక్టరు తయారు చేసే ఈ జాబితా నేరుగా రిజిస్ట్రార్ కే పంపుతారు
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం

ఏపీలో 22 - ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిషేధిత జాబితా నుండి ఆస్తులను తొలగించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు బదలాయిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22-A రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాకు సంబంధించి అందుతున్న ఫిర్యాదులను కేఈ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలోని కమిటీ హాల్ లో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్, సి.సి.ఎల్.ఏ అనీల్ చంద్రపునేఠా, సర్వే కమిషనర్ జగన్నాథం, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్, పలు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ, ఆ అధికారాలను కలెక్టర్లకు కట్టబెట్టడం ద్వారా ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు ప్రజలకు తప్పుతాయని అన్నారు.

22- ఏ నిషేధిత జాబితా రూపకల్పన ఇప్పటివరకు మ్యాన్యువల్ గా జరిగేదని, ఇకపై ఈ జాబితాను డిజిటల్ ఫార్మాట్ లో జిల్లా కలెక్టరు తయారు చేసి నేరుగా జిల్లా రిజిస్ట్రార్ కు అందించేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు చెప్పారు. ఈ సమస్యను మూడు నెలల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.  విశాఖపట్టణం జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, వుడా అప్రూవ్ చేసిన అధికారిక లే-అవుట్లకు కూడా అప్రోచ్ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి ప్రభుత్వ భూమి ఇవ్వట్లేదని, దీని వల్ల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అసవరమైన భూమికి మార్కెట్ ధర చెల్లించడానికి కూడా ప్రజలు ముందుకు వస్తున్న విషయాన్ని కేఈ దృష్టికి తెచ్చారు.

 దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని, నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గ్రామకంఠాలను సబ్ డివిజన్ చేసి నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు చర్యలు తీసుకుంటామని  కేఈ చెప్పారు. రాజానగం, జగ్గయ్యపేట, తిరుపతి  ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఏర్పాటు చేసుకున్నవారి భూములను, సాగు చేసుకుంటున్న ఇనామ్ భూములను కూడా 22-A జాబితాలో చేర్చారని,  ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేలు కోరారు.

ఇనామ్ భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీ వేశామని,  హైకోర్టు తీర్పు ఉండడంతో సర్వీస్ ఇనామ్ భూములను క్రమబద్ధీకరించలేమని, పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తామని దేవదాయ కమిషనర్ ఎమ్మెల్యేలకు తెలిపారు.

More Telugu News