Chandrababu: చంద్రబాబు బీజేపీ బాధితుడు.. జోషి మోదీ బాధితుడు: పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సరదా కామెంట్లు!

  • ఢిల్లీలో పలువురు నేతలను కలిసిన చంద్రబాబు
  • తాను చంద్రబాబు అభిమానినన్న కేంద్ర మంత్రి
  • ఏపీ బాధను అర్థం చేసుకుంటానన్న సీనియర్ నేత జోషీ

ఏపీకి న్యాయం కోసం ఢిల్లీ మెట్లెక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ సెంట్రల్ హాల్‌లో ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చారు. జోషీని చూసిన బాబు నవ్వుతూ నమస్కరించగా జోషీ ఆయన చేతులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘నేను మీ ప్రభుత్వ బాధితుడిని’’ అని జోషీతో చెప్పారు. పక్కనే ఉన్న విలేకరి వెంటనే అందుకుని ‘‘ఈయన మోదీ బాధితుడు’’ అని పేర్కొనడంతో నేతలిద్దరూ నవ్వుకున్నారు.

రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని చంద్రబాబు వివరించిన అనంతరం జోషి మాట్లాడుతూ ‘‘మీ బాధను నేను అర్థం చేసుకోగలను’’ అన్నారు. ఏపీకి జోషీ సంఘీభావం ప్రకటించడంతో బీజేపీలో ఉన్న అసంతృప్తి బయటపడినట్టు అయిందని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (బీజేపీ)తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హర్దీప్ మాట్లాడుతూ.. చంద్రబాబు గురించి చాలా విన్నానని, నిజానికి తాను ఆయన అభిమానినని పేర్కొన్నారు. ‘ఆల్ ది బెస్ట్’ అంటూ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, మరో మంత్రి విజయ్ గోయల్, బీజేపీ ఎంపీలు సాక్షి మహరాజ్, పరేశ్ రావల్, హేమమాలిని, టీఆర్ఎస్ ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డి తదితరులను కూడా చంద్రబాబు కలుసుకున్నారు.

More Telugu News