Bengalore: ఇద్దరు పిల్లల తల్లినంటూ పరిచయమై నయవంచన... అందంతో ఎరేసి పరారైన కి'లేడీ' కోసం గాలింపు!

  • సోషల్ మీడియాలో పరిచయమైన యువతి
  • ఇంటికి ఆహ్వానించి దగ్గరై వీడియోల రికార్డ్
  • బెదిరించి డబ్బు గుంజిన వైనం
  • మరింత మందిని మోసం చేసిందంటున్న పోలీసులు

సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తిని మోసం చేసి, ఐదున్నర లక్షల రూపాయలు గుంజిన అందాల కి'లేడీ' కోసం బెంగళూరు పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. ఈ యువతి మరింత మందిని మోసం చేసిందని చెబుతున్న పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 30 సంవత్సరాల వివాహితుడు గౌరీ శంకర్ కు ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయం అయింది.

తనకు వివాహమైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పుకున్న ఆమె, అతనితో పరిచయం పెంచుకుంది. తొలుత మంచిగా మాట్లాడుకున్న ఇద్దరూ, దాదాపు రెండు నెలల క్రితం ఓ రెస్టారెంట్ లో కలుసుకున్నారు. ఆపై ఇద్దరి మధ్యా పరిచయం, ఫేస్ బుక్ నుంచి వాట్స్ యాప్ కు, ఫోన్ కాల్స్ కూ వచ్చింది. ఓ రోజు గౌరీ శంకర్ ను తన ఇంటికి ఆహ్వానించిన ఆమె, అతనికి దగ్గరైంది. ఈ క్రమంలో పది రోజుల క్రితం తన ఫోన్ కు వచ్చిన వీడియోలు, చిత్రాలను చూసిన గౌరీ శంకర్ షాక్ తిన్నాడు.

సదరు యువతితో సన్నిహితంగా ఉన్న చిత్రాలు, సరసాలు ఆడుతున్నప్పుడు తీసిన వీడియోలు, ఆమే స్వయంగా తీసిందని గుర్తించాడు. ఆపై ఆమె ఫోన్ చేసి బెదిరింపులకు దిగి, ఈ ఫోటోల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, ఇంట్లో ఇచ్చి రచ్చ చేస్తానని చెప్పేసరికి భయపడి రూ. 5 లక్షలను సమర్పించుకున్నాడు. అంతటితో వదిలిపెట్టని ఆమె, మళ్లీ డబ్బు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆమె ఎంతోమందిని ఇలాగే వలేసి బుట్టలో వేసుకుని మోసం చేసిందని, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News