flipkart: ఫోన్ డెలివరీ ఆలస్యం చేశాడని.. ఫ్లిప్‌కార్ట్ బాయ్‌ను 20సార్లు పొడిచిన మహిళ

  • ఫోన్ డెలివరీ ఆలస్యంపై బాయ్‌తో వాగ్వాదం
  • కోపం పట్టలేక కత్తితో దాడి
  • సహకరించిన సోదరుడు
  • చావుబతుకుల్లో బాధితుడు

ఫ్లిప్‌కార్ట్‌లో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్‌ను ఆలస్యంగా డెలివరీ చేసిన బాయ్‌పై కత్తితో దాడిచేసిన మహిళ విచక్షణ రహితంగా పొడిచి పారేసింది. ఢిల్లీలో జరిగిందీ ఘటన. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతానికి చెందిన కమల్ దీప్ (30) ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేసింది. కొత్త ఫోన్‌ను చూసుకోవాలన్న ఆత్రుతతో ఉన్న కమల్ దీప్ పదేపదే డెలివరీ బాయ్‌కు ఫోన్ చేసింది. అయితే, అడ్రస్ కనుక్కోవడం కష్టంగా మారడంతో ఫోన్ డెలివరీ ఆలస్యమైంది.

చివరికి ఎలాగోలా అడ్రస్ కనుక్కుని కమల్ దీప్ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్‌ను చూడగానే కమల్ రంకెలేసింది. పెద్దగా అరుస్తూ వాగ్వాదానికి దిగింది. ఆలస్యానికి కారణం చెబుతున్నా వినిపించుకోని ఆమె వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి అతడిపై దాడి చేసింది. కడుపులో విచక్షణ రహితంగా పొడిచింది. ఇంట్లోనే ఉన్న ఆమె సోదరుడు జితేందర్ సింగ్(34) కూడా ఆమెతో జతకలిశాడు. షూ లేస్‌తో అతడి గొంతు బిగించి చంపేందుకు ప్రయత్నించారు.

రక్తపు మడుగులో పడి ఉన్న డెలివరీ బాయ్ నుంచి ఫోన్‌తోపాటు, అతడి వద్ద ఉన్న రూ.40 వేలను దోచుకున్నారు. అనంతరం ఓ వాహనంలో డెలివరీ బాయ్‌ను ఎక్కించి చందర్ విహార్ ప్రాంతంలోని ఓ మురికి కాల్వ వద్ద పడేశారు.

రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సంజయ్ గాంధీ ఆసుపత్రిలో బాధితుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతడి కడుపులో 20 కత్తిపోట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News