Telangana: ‘పట్టిసీమ’లో వాటా కోసం గట్టిగా పోరాడుతున్నాం : మంత్రి హరీశ్ రావు

  • ‘పట్టిసీమ’ ద్వారా 100 టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకుంది
  • అందులో తెలంగాణ హక్కు 45 టీఎంసీలు
  • కేంద్రం, కృష్ణా బోర్డుతో చర్చలు జరిపినా ఫలితం లేదు
  • తెలంగాణ శాసనమండలిలో హరీశ్ రావు

పట్టిసీమ ప్రాజెక్టులో 45 టీఎంసీల కృష్ణా నీటి వాటా కోసం గట్టిగా పోరాడుతున్నట్టు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈరోజు శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టు లోనూ న్యాయ పోరాటం సాగిస్తున్నట్టు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీల కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లించుకుందని, అందులో 45 టీఎంసీలు తెలంగాణ హక్కు అని అన్నారు.

ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డుతో పలు సార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. గతంలో కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, ప్రస్తుత మంత్రి గడ్కరీతో పలుమార్లు మాట్లాడినా స్పందించలేదని అన్నారు. పాలేరు పాత కాల్వ రికార్డు సమయంలో నాలుగు నెలల్లోనే ఆధునికీకరణ పనులు పూర్తి చేసామని, చిట్టచివరి రైతుకు సైతం నీరందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు వచ్చే వానాకాలంకి పూర్తి చేసి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సాగర్ ఎడమ కాలువ కింద పూర్తి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని తెలిపారు.

ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన నాగార్జున సాగర్ ఆధునికీకరణ పనులకు గాను వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్ లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, పాలేరు పాత కాలువ ఆధునికీకరణ ప్రాజెక్టు నిర్మాణం మరో చరిత్రను సృష్టించిందని హరీశ్ రావు చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువను ఆధునికీకరించకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మధిర, బోనకాల్, ముదిమాణిక్యం తదితర ప్రాంతాల్లో లక్ష ఎకరాల గ్యాప్ ఆయకట్టుకు నీరందేది కాదని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలో ఈ ఏడాది 6 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించినట్టు చెప్పారు.

 వచ్చే వానాకాలం నాటికి బ్రాహ్మణవెల్లం రిజర్వాయర్ పూర్తి చేస్తాం

నల్లగొండ జిల్లాలోని బ్రాహ్మణవెల్లం రిజర్వాయర్ పనులన్నింటినీ వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయనున్నట్టు హరీశ్ రావు హామీ ఇచ్చారు. నల్లగొండ, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక లక్ష ఎకరాలకు సాగునీరందించనున్నామని.. ముందుగా, వచ్చే వానాకాలం నాటికి 40 చెరువులను నింపేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ హయాంలో కేవలం 25 టీఎంసీల కేటాయింపులు ఉండగా, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 40 టీఎంసీలకు పెంచినట్టు హరీశ్ రావు తెలియజేశారు. వలసలు, ఆకలి, కరవుకు నిలయంగా ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రూపు రేఖలు మారిపోయాయని, ఈ సారి 27 టీఎంసీల నీటిని వాడామని, రెండు పంటలకు నీరందించామని, 2.50 లక్షల ఎకరాలకు ఈసారి సాగునీరందించామని తెలిపారు.

సాగునీటి అవసరాలకు రూ 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాల కోసం దాదాపు 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. శ్రీరాం సాగర్ పునరుజ్జీవ పథకం కింద నిర్మల్ జిల్లాలో పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఇందుకు గాను డి.పి.ఆర్.సిద్ధమవుతోందని, నిర్మల్, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించేందుకు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

సదర్ మాట్ ప్రాజెక్టు 50 సంవత్సరాల కల అని 550 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ ఏడాదే నిర్మల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగునీరందనుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులను దాదాపు 500 కోట్లతో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా కేవలం ఎన్నికల నినాదంగా మిగిలిన లోయర్ పెనుగంగకు తమ పార్టీ మోక్షం కలిగించిందని, బడ్జెట్ లో నిధులు కేటాయించి విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు రూ.1000 కోట్లతో బ్యారేజీలు,మరో రూ.600 కోట్లతో మూడు రిజర్వాయర్ల పనులు చేపడుతున్నట్టు చెప్పారు.

మిషన్ కాకతీయ నాల్గో దశలో ఉమ్మడి ఆదిలాబాద్ లో కొత్త చెరువుల నిర్మాణానికి రూ. 350 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ జిల్లాలోనే అత్యధికంగా 28 కొత్త చెరువుల నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టినట్టు హరీశ్ రావు తెలిపారు. 5.3 టీఎంసీల సామర్ధ్యంతో చేపడుతున్న కుప్టి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేస్తే కుంటాల జలపాతంలో 365 రోజులూ నీళ్లుంటాయని, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం బాగా వెనుకబడి ఉన్నందున దానిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టును నారాయణఖేడ్ వరకు విస్తరిస్తున్నట్టు హరీశ్ రావు ప్రకటించారు.

More Telugu News