Cognizant: కాగ్నిజెంట్ కు షాక్... బ్యాంకు ఖాతాల సీజ్!

  • ఆదాయపు పన్ను ఎగవేసిందన్న ఆరోపణలు 
  • రూ. 2,500 కోట్లు  రావాల్సి ఉందంటున్న ఐటీ శాఖ
  • చెన్నై, ముంబైలోని బ్యాంకు ఖాతాల సీజ్
  • మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కాగ్నిజెంట్

ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్నును ఎగవేసిందన్న ఆరోపణలపై ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ కు ఐటీ శాఖ షాకిచ్చింది. సంస్థకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగ్నిజెంట్ నుంచి 2016-17 సంవత్సరానికిగాను రూ. 2500 కోట్లకు పైగా టాక్స్ రావాల్సి వుందని ఆదాయ  పన్ను శాఖ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌ (డిటిటి)ను సంస్థ ఇప్పటి వరకూ చెల్లించ లేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సంస్థకు నోటీసులు పంపినా స్పందించలేదని, దీంతో చెన్నై, ముంబైలోని కాగ్నిజెంట్ బ్యాంకు ఖాతాలను సస్పెండ్ చేసి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాగా, తమ ఖాతాలను స్తంభింపజేయడంపై కాగ్నిజెంట్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. తాము అన్ని బకాయిలను చెల్లించామని సంస్థ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలను అందించడానికి మాత్రం ఆయన నిరాకరించడం గమనార్హం.

More Telugu News