Hyderabad: హైదరాబాద్‌లో దారుణం...ప్రేమకు నిరాకరించిందని యువతికి నిప్పంటించిన ప్రేమోన్మాది!

  • వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుందన్న అక్కసుతో ప్రేమోన్మాది ఘాతుకం
  • యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం
  • చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమకు నిరాకరించి మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమయిందన్న అక్కసుతో ఓ ఉన్మాది ఓ యువతిని సజీవదహనం చేయడానికి పూనుకున్నాడు. బాధితురాలు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని గోల్నాక, గంగానగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి అంబర్‌పేట ఇన్స్‌పెక్టర్ ఏపీ ఆనంద్ కుమార్ అందించిన వివరాల్లోకెళితే, గంగానగర్‌లో నివసించే రియాజ్ ఖాన్, అర్షియా బేగం దంపతుల కుమార్తె (17) చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. గోల్నాక కూరగాయల మార్కెట్‌లో వ్యాపారం చేసే మహ్మద్ సోహైల్ (19) ప్రేమ పేరుతో ఆ యువతిని కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి అతన్ని పలుమార్లు మందలించింది. మరోవైపు వేరే వ్యక్తితో ఆమెకు 15 రోజుల కిందటే నిశ్చితార్థం కూడా చేశారు. ఈ సంగతి తెలుసుకున్న సోహైల్ ఆవేశంతో యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి ఆమెను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అక్కడే ఉన్న కిరోసిన్ తీసుకుని ఆమె ఒంటిపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకుని 108లో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సోహైల్‌కు కూడా నిప్పంటుకోవడంతో అతన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.

More Telugu News