Payyavula Keshav: అవిశ్వాసంపై పవన్ కల్యాణ్ మద్దతు తీసుకొస్తానన్నారు.. ఇప్పుడు కనీసం కనపడట్లేదు!: పయ్యావుల

  • బీజేపీ, వైసీపీ, జనసేన తీరేంటో నేటితో మరింత స్పష్టమైంది
  • వైసీపీ నేతలు గల్లీలో తిట్లు ఢిల్లీలో పాదాభివందనాలు చేస్తున్నారు
  • టీఆర్ఎస్ ఆలోచన ఏంటో మాకు తెలిసింది

ఢిల్లీలో కొనసాగుతోన్న పరిణామాల దృష్ట్యా తాము ఆకస్మికంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించామని, బీజేపీ, వైసీపీ, జనసేన తీరు ఏంటో నేటితో మరింత స్పష్టమైందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ స్క్రిప్టును పాటిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే అన్ని పార్టీల మద్దతును కూడగడతానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు కనీసం కనిపించడం లేదని పయ్యావుల విమర్శించారు.

ఈ రోజు నిర్వహించిన అఖిలపక్ష సంఘాల సమావేశంలో అన్ని సంఘాల నేతలు తమ అభిప్రాయాలను తెలిపారని, తాము విద్యార్థి, ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకొని పోరాడతామని అన్నారు. మరోవైపు వైసీపీ నేతలు గల్లీలో కేంద్ర సర్కారుని తిట్లు తిడుతూ, ఢిల్లీలో మాత్రం పాదాభివందనాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఆలోచన ఏంటో తమకు తెలిసిందని, రహస్య అజెండా ఉన్న పార్టీలను చర్చలకు ఎన్నిసార్లు పిలిచినా ఉపయోగం ఉండదని అన్నారు.       

More Telugu News