mallikarjuna kharge: మల్లికార్జున ఖర్గేపై దాడికి యత్నించిన అన్నాడీఎంకే సభ్యులు

  • అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్న ఖర్గే
  • అన్నాడీఎంకే సభను అడ్డుకుంటోందంటూ ఆగ్రహం
  • ఖర్గేపై దాడికి యత్నించి అన్నాడీఎంకే ఎంపీలు

కావేరీ బోర్డు విషయమై పార్లమెంటు సమావేశాలను అన్నాడీఎంకే ఎంపీలు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. వారి ఆందోళనతో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపట్టలేని పరిస్థితి నెలకొంది. సభ ఆర్డర్ లో లేదంటూ గత కొన్ని రోజులుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను వాయిదా వేస్తున్నారు. ఈ రోజు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.

లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అన్నాడీఎంకే ఎంపీలను ఎగదోస్తూ సభను అడ్డుకుంటోందని అన్నారు. కావాలనే అన్నాడీఎంకే సభ్యులు లోక్ సభను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ తమకు చాలా ముఖ్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, అన్నాడీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఖర్గేపై అన్నాడీఎంకే సభ్యులు దాడికి యత్నించారు. ఈ క్రమంలో, ఇరు పార్టీల సభ్యులకు ఇతర పార్టీల నేతలు సర్దిచెప్పారు. అన్నాడీఎంకే సభ్యులను యూపీఏ ఛైర్మన్ సోనియాగాంధీ కూడా వారించే ప్రయత్నం చేశారు.

More Telugu News