allu sirish: రాజమండ్రి వస్తున్నాను... నా దగ్గర క్యాండిల్స్, పేపర్ కప్పులు కొనుక్కోండి: అభిమానులకు అల్లు శిరీష్ పిలుపు

  • ‘మేము సైతం’ షోకు గెస్టుగా అల్లు శిరీష్
  • జనని మానసిక వికలాంగుల సేవా సమితి కోసం నిధుల సేకరణ
  • అభిమానులు వచ్చి కొనుగోలు చేయాలని శిరీష్ పిలుపు

'మధ్యాహ్నం 12:30 గంటలకు రాజమండ్రి వస్తున్నాను... నా దగ్గర క్యాండిల్స్, పేపర్ కప్పులు కొనుక్కోండి' అంటూ మెగా ఫ్యామిలీ హీరో పిలుపునిస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి బుల్లితెరపై ‘మేము సైతం’ పేరిట ఒక షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఒక నిరుపేద కుటుంబానికి సహాయం అందిస్తారు. టాలీవుడ్ సెలబ్రిటీలతో రకరకాల పనులు చేయించి, తద్వారా సమకూరిన మొత్తానికి మరి కొంత మొత్తాన్ని జత చేసి, షోలో పాల్గొనే కుటుంబానికి అందిస్తారు.

ఈసారి ఈ షోకు గెస్టుగా అల్లు శిరీష్ వస్తున్నాడు. ఇందులో భాగంగా 'జనని మానసిక వికలాంగుల సేవా సమితి' కోసం నిధులు సమీకరించే నిమిత్తం అల్లు శిరీష్ రాజమండ్రి వెళ్లబోతున్నాడు. దీంతో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ‘‘హలో రాజమండ్రి.. రేపు జీఐఈటీ కాలేజ్ కు వస్తున్నాను. మధ్యాహ్నం 12.30కు ఈ కాలేజ్ కు వచ్చి, క్యాండిల్స్, పేపర్ కప్పులు అమ్ముతాను. ఇలా కలెక్ట్ చేసిన డబ్బులను జనని మానసిక వికలాంగుల సేవా సమితికి ఉపయోగిస్తాను. ఓ మంచి పని చేసేందుకు రండి. ఈ వస్తువులు కొనండి’’ అంటూ నిన్న అభిమానులకు పిలుపునిచ్చాడు. 

More Telugu News