no confidence motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఐదు పార్టీలు.. సహకరిస్తామన్న టీఆర్ఎస్!

  • లోక్ సభలో పాంచ్ పటాకా
  • కేంద్రంపై ముప్పేట దాడికి సిద్ధమవుతున్న విపక్షాలు
  • అవిశ్వాస తీర్మానాలను నేడు అడ్మిట్ చేసే అవకాశం

కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా ఐదు పార్టీలు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. తొలుత కేవలం టీడీపీ, వైసీపీలు మాత్రమే అవిశ్వాస తీర్మానం ఇవ్వగా... చివర్లో కాంగ్రెస్ కూడా ఆ జాబితాలో చేరింది. తాజాగా మోదీ ప్రభుత్వంపై సీపీఎం, ఆర్ఎస్పీ కూడా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా సొంతంగా మరో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో, ఈరోజు పార్లమెంటులో కేంద్రంపై ముప్పేట దాడికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు, ఇన్ని రోజులు రిజర్వేషన్లపై పోరాడుతూ, అవిశ్వాసంపై చర్చకు అంతరాయం కలిగించిన టీఆర్ఎస్ పార్టీ సైతం తన వైఖరి మార్చుకుంది. అవిశ్వాసంపై చర్చకు తాము సహకరిస్తామని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. ఇకపోతే కావేరీ బోర్డు గురించి అన్నాడీఎంకే ఎంపీలు యథావిధిగా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు, అవిశ్వాసం తీర్మానాలను లోక్ సభలో నేడు అడ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నారు. రేపు చర్చ జరిగే అవకాశం ఉంది. విపక్షాలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు అధికారపక్షం సిద్ధమైంది. 

More Telugu News