Cricket: ఇంటికెళ్లి షమీని కలిసిన భార్య హసీన్ జహాన్

  • డెహ్రాడూన్ నుంచి కోల్ కతా వస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన మహ్మద్ షమీ
  • షమీని పరామర్శించేందుకు ఆయన ఇంటికెళ్లిన భార్య హసీన్ జహాన్
  • షమీ నాకు శత్రువు కాదు, అతనికి చెడు జరగాలని నేనెప్పుడూ కోరుకోలేదు

టీమిండియా పేసర్ మహ్మద్ షమీని అతని భార్య హసీన్ జహాన్ కలిసింది. డెహ్రాడూన్ లో బెంగాల్‌ మాజీ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ కు చెందిన అకాడమీలో సాధన చేసి తిరిగి కోల్ కతా వస్తున్న క్రమంలో షమీ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని, ఇంటికి చేరిన షమీని అతని భార్య హసీన్ జహాన్ కలిసింది. కుమార్తె సహా షమీ ఇంటికి వెళ్లిన హసీన్ జహాన్, అతనిని పరామర్శించిందని ఆమె లాయర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు.

కోల్‌ కతాలోని లాల్‌ బజార్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కు సమాచారమిచ్చిన తరువాతే షమీని కలిసేందుకు ఆమె వెళ్లిందని ఆయన చెప్పారు. షమీ తనకు శత్రువు కాదని, అతను ఆరోగ్యంగా లేకపోతే తాను సంతోషంగా ఉండలేనని తెలిపిందని అన్నారు. షమీకి చెడు జరగాలని తానెప్పుడూ కోరుకోలేదని, తనకు న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకున్నానని చెప్పిందని ఆయన వెల్లడించారు. షమీ తొందరగా కోలుకోవాలని అల్లాను కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, షమీపై ఆమె  పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News