Cricket: క్రికెట్ ఆస్ట్రేలియా, స్మిత్, వార్నర్ కు స్పాన్సర్ల దెబ్బ?

  • బాల్ ట్యాంపరింగ్ వివాదంతో మసకబారిన సీఏ ప్రతిష్ఠ
  • బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని తీవ్రంగా తప్పుబట్టిన స్పాన్సర్లు
  • ఒప్పందాల పునఃసమీక్ష నిర్ణయం

బాల్ ట్యాంపరింగ్‌ వివాదంతో ఆసీస్ కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆటగాళ్లు, జట్టు, బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని స్పాన్సరింగ్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో వివాదంపై స్పాన్సరింగ్ కంపెనీలు తీవ్రంగా స్పందించాయి.

దేశపరువు ప్రతిష్ఠలను దిగజార్చిన ఆటగాళ్ల తీరుతో తమ బ్రాండ్ వాల్యూ దారుణంగా దెబ్బతిందని, భవిష్యత్తులో తమ బ్రాండ్లకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పాన్సరింగ్ కంపెనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ల తీరు తమను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఆటగాళ్లు ఇంత నీచమైన పని చేస్తారని ఊహించలేకపోయామని ఆసీస్ జట్టు అధికారిక స్పాన్సర్ క్వాంటమ్ ఎయిర్‌ లైన్స్ తెలిపింది. ఈ వివాదంపై సీఏతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది.

మరోవైపు స్మిత్ సేన చేసిన పనితో ఆసీస్ జాతీయ మహిళా జట్టును స్పాన్సర్ చేస్తున్న కామన్వెల్త్ బ్యాంకు సీఏను వివరణ కోరిందని తెలుస్తోంది. లుక్రాటివ్ టీవీతో కుదుర్చుకున్న 600 మిలియన్ డాలర్ల ఐదేళ్ల ఒప్పందం ఈ ఏడాది చివరకు ముగియనుంది. తాజా వివాదం నేపథ్యంలో ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు సీఏ గవర్నింగ్ బాడీతో చర్చలు జరుపుతామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వివాదాన్ని బూచిగా చూపి బేరసారాలకు దిగనున్నట్టు తెలుస్తోంది.

 ఆసీస్ జట్టు అతిపెద్ద స్పాన్సర్ అయిన మాగెల్లాన్ సంస్థ తాజా వివాదంపై విస్మయం వ్యక్తం చేసింది. బాల్ ట్యాంపరింగ్‌ తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, జట్టు చేసిన పని క్షమించరానిదని స్పష్టం చేసింది. దీనిపై సీఏ స్పందన గురించి వేచి చూస్తున్నామని తెలిపింది. ఆస్ట్రేలియాలో క్రికెట్‌ ను గొప్పగా చూస్తారని, దేశ ప్రధాని తరువాత అంతటి గౌరవం ఇచ్చేది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ కేనని, అంతటి వ్యక్తి ఇలాంటి పాడుపనికి పాల్పడడం క్షమించరాని నేరమని స్కిన్స్ కంప్రెషన్ వియర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జైమీ ఫుల్లెర్ ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వడం అక్కడ క్రికెట్ పై నున్న మక్కువను చూపెడుతోంది.

More Telugu News