galla jaydav: రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ, జనసేన అలా చేస్తున్నాయి: ఎంపీ గల్లా జయదేవ్

  • పార్లమెంటులో వాస్తవంగా పోరాడుతున్నదెవరో ప్రజలు చూస్తున్నారు
  • జనసేన, వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే మోదీని నిలదీయాలి
  • టీడీపీని వైసీపీ, జనసేన రాజకీయ లబ్ధి కోసమే నిందిస్తున్నాయి

టీడీపీని వైసీపీ, జనసేన పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నిందిస్తున్నాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంటులో వాస్తవంగా పోరాడుతున్నదెవరో ప్రజలు చూస్తున్నారని, జనసేన, వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిలదీయాలని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఆర్థిక సంఘం నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని అన్నారు.

విభజన హామీల సాధనకు టీడీపీ నిరంతరం పోరాడుతుందని, తాము పార్లమెంటు లోపల, బయట పోరాడుతున్నామని గల్లా జయదేవ్ తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తున్నా సభాపతి స్పందించట్లేదని, గతంలో ఆర్థిక బిల్లులు వంటి కీలక బిల్లులను అర్ధగంటలోనే ఆమోదించారని అన్నారు. సభాపతి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News