isro: వాయిదాపడ్డ చంద్రయాన్ - 2 ప్రయోగం: ఇస్రో

  • సాంకేతిక కారణాల రీత్యా వాయిదా వేస్తున్నాం
  • నిపుణులు కొన్ని మార్పులను సూచించారు
  • అక్టోబర్ లో ప్రయోగిస్తాం 
  • ఈ నెల 29న జీశాట్ -6 ఏ ఉపగ్రహాన్నిప్రయోగిస్తాం: ఇస్రో చైర్మన్

చంద్రయాన్ -2 ప్రయోగం వాయిదా పడినట్టు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్టులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రయోగాన్ని వచ్చే నెలలో నిర్వహించాలనుకుని ముందుగా భావించినప్పటికీ సాంకేతిక కారణాల రీత్యా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. నిపుణులు కొన్ని మార్పులను సూచించారని, చంద్రయాన్ -2 ప్రయోగం అక్టోబర్ లో ఉంటుందని తెలిపారు.

జాలర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించనున్న మొబైల్ యాప్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తవుతాయని, ఏప్రిల్ నుండి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా, చంద్రుడిపై మరిన్ని పరిశోధనల నిమిత్తం చేపట్టనున్న ఈ ప్రయోగానికి పూర్తిగా దేశీయ పరిఙ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రయోగంలో జీఎస్‌ఎల్‌వీ ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను చంద్రుడిపైకి పంపనున్నారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 29న జీశాట్ -6 ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇస్రో ప్రకటించింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండో లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్టు పేర్కొంది. 

More Telugu News