Uttar Pradesh: పాశవికమైన శిక్ష... చుట్టూ మగాళ్లు గుమిగూడి ఉండగా, భార్యను చెట్టుకి కట్టి సైకిల్ ట్యూబుతో చితక్కొట్టిన భర్త!

  • భార్యకు వివాహేతర సంబంధం అంటగడుతూ పంచాయతీ పెట్టిన భర్త
  • కట్టేసి కొట్టాలంటూ శిక్ష విధించిన పంచాయతీ
  • సైకిల్ ట్యూబు, టైరు దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయిన బాధితురాలు

ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్‌ జిల్లాలో ఒక అబలకు అత్యంత పాశవికమైన శిక్షను పంచాయతీ విధించగా, దానిని సాక్షాత్తూ కట్టుకున్నవాడే అమలు చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... దేశ రాజధాని ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలోని బులంద్ షహర్ జిల్లాకు చెందిన గ్రామంలోని మహిళ వివాహేతర సంబంధం కలిగి ఉందని ఆరోపిస్తూ, ఆమె భర్త పంచాయతీ పెట్టించాడు. దీంతో పంచాయతీ ఆమెను కట్టేసి కొట్టాలని శిక్ష విధించింది.

 దీంతో ఆమె భర్త పంచాయతీకి వచ్చిన ఊరి ప్రజలందరి ముందు అక్కడే ఉన్న చెట్టుకు ఆమె చేతులు కట్టేసి, సైకిల్ ట్యూబు, టైరుతో కొట్టాడు. దెబ్బలు తాళలేక ఆమె స్పృహ కోల్పోయింది. దానిని చూసిన వారంతా నవ్వుతూ వీడియోలు తీసుకున్నారే కానీ, అది తప్పు అని ఒక్కరు కూడా చెప్పకపోవడం విశేషం. దీనిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె భర్త, గ్రామ ప్రధాన్ ను అరెస్టు చేశారు. దీనికి కారణమైన మరో 25 మందిపై కేసులు నమోదు చేశారు. 

More Telugu News