small saving schemes: చిన్నమొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు... త్వరలోనే రేట్ల పెంపు అవకాశం

  • ఇన్నాళ్లూ తగ్గుతూ వచ్చిన వడ్డీ రేట్లు
  • కానీ, ప్రభుత్వ 10 ఏళ్ల బాండ్లపై 7.5 శాతానికి చేరిన రాబడులు
  • దీంతో రేట్ల పెంపునకు అవకాశం
  • ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికంపై త్వరలో ప్రకటన

 పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, ఎన్ఎస్ సీ, సుకన్య సమృద్ధి యోజన తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ఇంత కాలం వడ్డీ రేట్లు తగ్గుతూ రాగా, మళ్లీ అవి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన తొమ్మిది నెలలుగా ప్రభుత్వ బాండ్ల రాబడులు పెరుగుతూ వస్తున్నాయి. 10 ఏళ్ల బాండ్ పై రాబడులు ఈ జనవరి నుంచి 7.5 శాతంగా ఉన్నాయి. దీంతో పలు పథకాలపై 20 బేసిస్ పాయింట్ల వరకు (0.20శాతం) వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయి. ఎందుకంటే, బాండ్ల రాబడులపై కనీసం ఇంత మేర అదనంగా వడ్డీ రేటు ఉండాలన్న దానికి ఓ ఫార్ములా ఉంది. దీంతో ఆ మేరకు రేట్లను సమరించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే తదుపరి త్రైమాసికంలో అమలయ్యే వడ్డీ రేట్లపై ఈ నెల చివర్లోగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. పీపీఎఫ్, ఎన్ఎస్ సీపై వడ్డీ రేటు 7.8 శాతానికి, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రేటు 8.25 శాతానికి, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ రేటు 8.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా.

More Telugu News