kerala: పెళ్లికి ఒక్కరోజు ముందు కుమార్తెను దారుణంగా చంపేసిన తండ్రి.. ప్రేమ వ్యవహారమే కారణం!

  • కేరళలో పరువు హత్య
  • నేడు వివాహం జరగాల్సి ఉండగా ఘోరం
  • దళితుడిని ప్రేమించిందన్న అక్కసుతో హత్య చేసిన తండ్రి

కేరళలో దారుణం జరిగింది. కుమార్తె వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో తండ్రి పరువు హత్యకు పాల్పడ్డాడు. పెళ్లికి ఒక్క రోజు ముందు కన్న కూతురని కూడా చూడకుండా దారుణంగా చంపేశాడు. గురువారం అరిక్కోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అతిర (21) ఓ సైనికుడిని ప్రేమించింది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పి అతడినే పెళ్లాడతానని పెద్దలను ఒప్పించింది.

కుమార్తె ప్రేమించింది దళితుడిని కావడంతో తండ్రి రాజన్ (42) అంగీకరించేందుకు నిరాకరించాడు. నేడు వివాహం జరగనుండగా కుమార్తె తీరును జీర్ణించుకోలేకపోయిన తండ్రి గురువారం సాయంత్రం కుమార్తెతో వాగ్వాదానికి దిగాడు. పెళ్లికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో రెచ్చిపోయిన రాజన్ కుమార్తెపై పదునైన ఆయుధంతో దాడిచేశాడు. దీంతో అతిర తీవ్ర గాయాలపాలైంది. రక్తపుమడుగులో కుప్పకూలిన అతిరను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News