shivaji: ఆ కుట్ర పేరు ఆపరేషన్‌ ద్రవిడ.. ఓ జాతీయ పార్టీ మొత్తం రూ.4,800 కోట్లు ఖర్చు చేస్తోంది: హీరో శివాజీ సంచలన ఆరోపణలు

  • ఆ జాతీయ పార్టీ చేపట్టిన ఆపరేషన్ పేరు 'గరుడ' కాదు
  • తమిళనాడు, కేరళలో ఆపరేషన్ రావణ
  • కర్ణాటకకు సంబంధించిన ఆపరేషన్ పేరు 'కుమార'
  • అన్ని విషయాలను పొందుపర్చిన ఓ పెన్‌డ్రైవ్‌ను అందరికీ ఇస్తా

గతేడాది తనకో విషయం తెలిసిందని, ఓ జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్న ఓ సంస్థకు సంబంధించిన కల్యాణ్ జీ అనే ఓ వ్యక్తితో సదరు జాతీయ పార్టీ కుట్ర పన్నుతోందని సినీ హీరో, ప్రత్యేక హోదా సాధన సమితి నేత శివాజీ అన్నారు. కల్యాణ్ జీ అనే ఆ వ్యక్తి ప్రస్తుతం కర్ణాటక నుంచి ఆ జాతీయపార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారని తెలిపారు. ఈ రోజు శివాజీ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... 'తెలుగు రాష్ట్రాల్లో ఆ జాతీయ పార్టీ ఆపరేషన్ పేరు మీరందరు అనుకుంటున్నట్లు ఆపరేషన్ గరుడ కాదు.. ఆపరేషన్ ద్రవిడ. అలాగే తమిళనాడు, కేరళలో ఆపరేషన్ రావణ అని, కర్ణాటకకు సంబంధించిన ఆపరేషన్ పేరు కుమార అని పేర్లు పెట్టారు' అని ఆరోపించారు.

ఇందుకు సంబంధించిన విషయాలన్నింటినీ ఓ పెన్‌డ్రైవ్‌లో పొందుపర్చానని త్వరలోనే అందరికీ ఇస్తానని శివాజీ చెప్పారు. అందులో పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు. ఓ కొత్త నాయకుడిని ఆ జాతీయ పార్టీ పావులా వాడుకుంటోందని తెలిపారు. ఏపీ మీద ఆధిపత్యం చెలాయించడానికి ఎటువంటి చర్యలు చేపట్టారో తాను తెలుపుతానని అన్నారు. మొత్తం 4,800 కోట్ల రూపాయలు ఓ జాతీయ పార్టీ ఈ ఆపరేషన్‌ల కోసం కేటాయించిందని అన్నారు.

ఏపీలో ఉన్న ప్రస్తుత రాజకీయ అవకాశాలను వాడుకునేందుకు జాతీయ పార్టీ కుట్ర పన్నిందని సంచలన ఆరోపణలు చేశారు. ఓ పెన్‌డ్రైవ్‌ ఇస్తానని, అందులో అన్ని విషయాలు తెలుసుకుని తనను మిగతా విషయాలపై ప్రశ్నించాలని అన్నారు. కాగా, ఆ 'జాతీయ పార్టీ' పేరును శివాజీ నేరుగా చెప్పలేదు. 

More Telugu News