Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మంటల్లో కాలిపోయిన 150 గుడిసెలు

  • సైబర్ టవర్స్ సమీపంలోని పత్రికా నగర్‌లో ఘటన
  • ఆ సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
  • ఆ ప్రదేశంలో నివసిస్తోన్న నాలుగు రాష్ట్రాలకు చెందిన పేదలు

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ సమీపంలో ఉన్న పత్రికా నగర్‌లో సుమారు 150 గుడిసెలకు మంటలు అంటుకోవడంతో కలకలం చెలరేగింది. అక్కడి ఖాళీ ప్రదేశంలో కొంత కాలంగా పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. రోజూలాగే అందరూ కూలిపనికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఆ ప్రదేశంలో ఉంటున్నవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని తాము పనిచేస్తోన్న చోట్ల నుంచి బాధితులు తిరిగి వచ్చారు. గుడిసెల్లోని తమ వస్తువులు, సరుకులు అంతా కాలిపోయాయని తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమాచారం అందాల్సి ఉంది. 

More Telugu News