peddireddy ramachandra reddy: భార్య గురించి వైసీపీ ఎమ్మెల్యే తప్పుడు సమాచారం.. విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు

  • అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • భార్య గురించి ఓ చోట గృహిణిగా, మరోచోట కంపెనీ ఎండీగా పేర్కొన్న పెద్దిరెడ్డి
  • పిటిషన్ లో వాస్తవాలు ఉన్నాయని చెప్పిన ధర్మాసనం

వైసీపీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్ లో భార్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ వాదనతో ఏకీభవించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే, 2014 ఎన్నికల సందర్భంగా పెద్దిరెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ తప్పులతడకగా ఉందంటూ పుంగనూరు టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజు హైకోర్టును ఆశ్రయించారు. అఫిడవిట్ లో తన భార్యను ఒక చోట గృహిణిగా, మరోచోట కంపెనీ ఎండీగా చూపించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆస్తుల విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.

తన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను కూడా అందించారు. అయితే, ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. పిటిషనర్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని... పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. 

More Telugu News