babu rajendra prasad: బాబూ రాజేంద్రప్రసాద్.. సినీ పరిశ్రమపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయొద్దు!: తమ్మారెడ్డి భరద్వాజ

  • పదవి ఉంది కదా అని వ్యాఖ్యలు చేయకండి
  • చాలామంది సినిమా వాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు
  • ముందుగా వాళ్లతో ప్రకటనలు ఇప్పించండి 

ప్రత్యేక హోదా కోసం తెలుగు హీరోలు ఎందుకు పోరాడటం లేదని, ఎవరికైనా అవార్డు రాకపోతే రచ్చ రచ్చ చేస్తారని  టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పదవి ఉంది కదా అని చెప్పి టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ, చాలామంది సినిమా వాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని, ముందు వాళ్లతో ప్రకటనలు ఇప్పిస్తే, ఆ తర్వాత మిగతావారు మాట్లాడతారని అన్నారు. ఇటీవల నంది అవార్డులను ఎవరికి బడితే వాళ్లకిచ్చేశారు కదా! ఆ అవార్డులు తీసుకున్నవాళ్లతో ప్రత్యేకహోదా విషయమై ముందు మాట్లాడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజేంద్రప్రసాద్ తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు కనుకనే తాను ఈవిధంగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. 

More Telugu News