Pawan Kalyan: బీజేపీతో కలిసి పవన్ జీరో స్థాయికి వచ్చేశారు : మంత్రి చినరాజప్ప

  • బీజేపీ డైరెక్షన్ లో పవన్ వెళ్తున్నారు
  • ఏపీకి బీజేపీ అన్యాయం చేసిన విషయాన్ని మాట్లాడరే?
  • ఏపీకి రూ.75 వేల కోట్లు రావాలని ‘జనసేన’ ఆవిర్భావ సభలో ఎందుకు చెప్పలేదు? : ఏపీ ఉపముఖ్యమంత్రి

బీజేపీతో కలిసిన పవన్ కల్యాణ్ జీరో స్థాయికి వచ్చేశారని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ డైరెక్షన్ లో పవన్ వెళ్తున్నారని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఏపీకి రూ.75 వేల కోట్లు రావాలని చెప్పిన పవన్, ఆ విషయాన్ని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఈ విషయాన్ని పవన్ మాట్లాడరని, మోదీ డైరెక్షన్ లో పవన్ పనిచేస్తున్నారు కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ నేత కళా వెంకట్రావు మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, చంద్రబాబుకు మార్కులు ఇచ్చే రాజకీయ పరిణతి పవన్ కు ఉందా? అని ప్రశ్నించారు. రాజకీయంగా పవన్ కు మెచ్యూరిటీ లేదని అన్నారు. ఎవరో అనుకుంటుంటే విన్నానంటూ నారా లోకేశ్ పై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు.

More Telugu News