Chandrababu: అన్ని వేళ్లు మోదీ వైపు చూపిస్తుంటే.. ఆ రెండు పార్టీల వేళ్లే నా వైపు చూపిస్తున్నాయి : చంద్రబాబు

  • ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాం.. ఓపికగా ఎదురు చూశాం
  • నాలుగేళ్ల సమయాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకోలేదు
  • మాకు పదవులు ముఖ్యం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
  • టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు

నాలుగేళ్ల సమయాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నామని, నాలుగేళ్లు ఓపికగా ఎదురుచూశామని అన్నారు.

రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, తాము ఎక్కడా తొందరపడలేదని తమ పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజల హక్కుల సాధనే తమ లక్ష్యమని తమ నేతలతో చంద్రబాబు చెప్పారు. తొలి ఏడాదిలో ఇవ్వాల్సిన లోటు నిధులను ఐదేళ్ల పాటు నాన్చారని, ఇప్పుడు లోటు కింద ఇంకా రూ.138 కోట్లే ఇస్తామంటున్నారని, ఏపీకి అన్యాయం చేయడమే కాకుండా, ఎదురుదాడికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నాపై దాడి చేయడం అంటే రాష్ట్రాన్ని బలహీనపరచడమే. నాపై దాడికి చూపిస్తున్న శ్రద్ధలో కొంతైనా ఏపీ అభివృద్ధిపై చూపితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అవిశ్వాసం నోటీసులను అనుమతించకుండా మూడు రోజులుగా లోక్ సభలో వాయిదాలు వేస్తున్నారు. బీజేపీ తరపున వైసీపీ, జనసేన పార్టీలు మాట్లాడుతున్నాయి. అన్ని వేళ్లు మోదీ వైపు చూపిస్తుంటే.. ఈ రెండు పార్టీల వేళ్లు మాత్రం నా వైపు చూపిస్తున్నాయి’ అని సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నట్టు సమాచారం.

More Telugu News