Nara Lokesh: పవన్ కల్యాణ్ నాపై దుమ్మెత్తి పోస్తే.. నేను దులుపుకోవాలా?: నారా లోకేష్ ఫైర్

  • నాలుగేళ్లపాటు టీడీపీతోనే ఉన్నారు
  • ఒక్కసారిగా రాష్ట్రమంతా అవినీతిగా కనిపించిందా?
  • అవినీతిపై ఆధారాలుంటే.. ఒక్క రోజులోనే మాట ఎలా మార్చారు?
  • ఎవరో చెప్పిన మాటలు విని.. విమర్శలు చేస్తారా?

తనపై అవినీతి ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలతో తనపై దుమ్మెత్తి పోస్తే, తాను దులుపుకుని పోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చేసిన నిరాధారమైన ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకే పవన్ రేటింగ్ ఇస్తారా? అంటూ ధ్వజమెత్తారు.

శేఖర్ రెడ్డితో తనకు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించిన పవన్... ఆ తర్వాత మాట మార్చారని అన్నారు. ఆయన వద్ద నిజంగా ఆధారాలు ఉంటే... ఒక్క రోజులోనే ఎలా మాట మారుస్తారని ప్రశ్నించారు. ప్లానింగ్ బోర్డు సభ్యుడు పెద్ది రామారావు ఫొటోను శేఖర్ రెడ్డి ఫొటోగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోని టీడీఎల్సీ కార్యాలయం వద్ద మీడియాతో చిట్ చాట్ చేస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే... నేరుగా తనకే ఫోన్ చేసి అడగవచ్చు కదా? అని అన్నారు. మా తాత ఎన్టీఆర్ కు చెడ్డ పేరు తీసుకొన్నానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పుట్టే సమయానికే మా తాత ముఖ్యమంత్రి అని అన్నారు. ప్రతియేటా ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నది తామేనని చెప్పారు. నాలుగేళ్లు తమతో కలసి ఉన్న పవన్ కు... ఒక్కసారిగా రాష్ట్రమంతా అవినీతిలో మునిగిపోయినట్టు కనిపించిందా? అంటూ ప్రశ్నించారు. పూర్తి స్థాయి సమాచారం లేకుండానే, ఎవరో చెబితే విమర్శలు గుప్పిస్తారా? అని నిలదీశారు. తాను ఎంతో క్రమశిక్షణతో పెరిగానని తెలిపారు.

More Telugu News