Road Accident: హైదరాబాద్‌లో మద్యం మత్తులో యువతి బీభత్సం....యువకుడు మృతి

  • మద్యం మత్తులో జుమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్‌ని కారుతో ఢీకొట్టిన ఢిల్లీ యువతి
  • చికిత్స పొందుతూ ఒకరు మృతి...ఆసుపత్రిలో మరొకరు
  • నిందితురాలిపై మోటారు వాహన చట్టంలోని 304ఏ, 338, 185 సెక్షన్ల కింద కేసు నమోదు

ఓ యువతి మద్యం మత్తులో కారు నడిపి ఓ యువకుడి మరణానికి కారణమయింది. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం ఐటీ కారిడార్ టీ-హబ్ రెండో ఫేజ్ వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే, బోరబండకు చెందిన చిరంజీవి (20) అతని స్నేహితుడు సాయికుమార్ (20) జుమాటో కంపెనీలో ఫుడ్ డెలివరీ సెక్షన్‌లో పనిచేస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే శనివారం కూడా రాయదుర్గం ఐటీ కారిడార్ టీ-హబ్ రెండో ఫేజ్ వద్ద యాక్టివా వాహనంపై వెళుతుండగా మద్యం మత్తులో ఉన్న 26 ఏళ్ల జెన్ని జాకబ్ తన కారుతో వేగంగా వచ్చి వారిని ఢీకొంది. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. జెన్ని కారు మూడు పల్టీలు కొట్టడంతో అది నుజ్జునుజ్జయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రక్తపు మడుగులో పడి ఉన్న చిరంజీవి, సాయిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిరంజీవి ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. సాయికుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఢిల్లీకి చెందిన జెన్ని జాకబ్ నాలుగు రోజుల కిందట తన స్నేహితురాలు లిజాతో కలిసి కోకాపేట గ్రీన్‌బ్లాసమ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న స్నేహితుడు రౌనిత్ కుమార్ వద్దకు వచ్చారు. నగర వీక్షణ కోసం ఓ కారును అద్దెకు తీసుకుని ఆమె సొంతంగా డ్రైవ్ చేస్తూ తిరుగుతోంది.

కాగా, ప్రమాదం జరిగిన సమయంలో జెన్నీ మద్యం సేవించి ఉందని, బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్ష చేస్తే మీటరు రీడింగ్ 51 వచ్చిందని రాయదుర్గం ఇన్స్‌పెక్టర్ రాంబాబు తెలిపారు. మోటారు వాహన చట్టంలోని 304ఏ, 338, 185 సెక్షన్ల కింద నిందితురాలిపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.

More Telugu News