Tamilnadu: ఆస్తి కోసం తల్లిని హతమార్చి తలను పట్టుకెళ్లిన కిరాతకుడు!

  • తల్లిని దారుణంగా హతమార్చిన కుమారుడు
  • తల్లి తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన వైనం
  • షాక్ తిన్న పోలీసులు

ఆస్తి కోసం కన్నతల్లినే అత్యంత కిరాతకంగా హతమార్చాడో కుమారుడు. అంతేకాదు, తల నరికి దానిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దారుణమైన ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పుదుక్కోట్టై జిల్లాలోని కరంబకుడి సమీపంలోని మరవంబట్టి గ్రామానికి చెందిన తంగరాజ్, తిలగరాణి (48) భార్యాభర్తలు. వీరికి ఐదుగురు కుమారులు.

ఆస్తిని పంచివ్వాలంటూ పెద్ద కుమారుడు ఆనంద్ (23) గత కొంతకాలంగా తల్లితో ఘర్షణ పడుతున్నాడు. ఆదివారం ఉదయం వీరిద్దరి మధ్య మరోమారు వాగ్వాదం జరిగింది. ఆస్తిని తక్షణం పంచి ఇవ్వాల్సిందేనని తల్లిని బెదిరించాడు. ఆమె అందుకు నిరాకరించడంతో సహనం కోల్పోయిన ఆనంద్ కత్తితో విచక్షణ రహితంగా తల్లిపై దాడిచేశాడు. ఆమె గొంతు కోసి మొండెం నుంచి తలను వేరు చేశాడు. అనంతరం దానిని బైక్‌పై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మొండెం నుంచి వేరు చేసిన తలతో వచ్చిన నిందితుడిని చూసి తొలుత పోలీసులు షాక్ తిన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు.

More Telugu News