Akhil: కొత్త సినిమా గురించి స్వయంగా ప్రకటించిన అఖిల్

  • ఉగాది సందర్భంగా తన మూడో చిత్రం వివరాల వెల్లడి
  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్నట్లు ట్వీట్
  • మేలో చిత్రీకరణ ప్రారంభం...బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత

అక్కినేని యువ హీరో అఖిల్ తన తదుపరి సినిమా వివరాలను ట్విట్టర్ వేదికగా ఉగాది పర్వదినాన ఈ రోజు స్వయంగా ప్రకటించాడు. 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజమేనంటూ అఖిల్ తాజాగా చెప్పడం గమనార్హం.

"ఆదివారాలు చాలా లవ్లీగా ఉంటాయి కదూ! ఈ లవ్లీ ఆదివారం నా కొత్త సినిమా ప్రాజెక్టు వివరాలను వెల్లడించాలనుకుంటున్నాను. వెంకీ అట్లూరి నా కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మేలో చిత్రీకరణ మొదలవుతుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత" అని అఖిల్ ట్వీట్ చేశాడు.

అఖిల్ తెరంగేట్ర చిత్రం 'అఖిల్‌' బాక్సాఫీసు వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఇటీవల విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేసిన 'హలో' మాత్రం కాస్త పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో తన మూడో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి తీసిన తొలిప్రేమ చిత్రం ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో అఖిల్‌తో ఆయన తీయబోయే సినిమా కూడా ప్రేమకథగానే ఉండొచ్చని తెలుస్తోంది.

More Telugu News