Chandrababu: బీజేపీ వాళ్లను ఇద్దర్ని రాజ్యసభకు పంపాను... ఇదా వారు చేసేది?: చంద్రబాబు

  • రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ
  • సమస్యలు పరిష్కరించాలని కోరడమే తప్పయింది
  • విజయవాడ ఉగాది వేడుకల్లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. వారు అడిగితే ఇద్దరు బీజేపీ వాళ్లను టీడీపీ ఎమ్మెల్యేల సాయంతో ఎంపీలుగా చేసి, రాజ్యసభకు పంపించానని, ఆ మాత్రం విశ్వాసం కూడా వారికి లేకపోయిందని విమర్శలు గుప్పించారు.

ఉగాది సందర్భంగా విజయవాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో తాను త్యాగాలను చేశానని చెప్పారు. టీడీపీ నాయకులను పక్కనబెట్టి బీజేపీ వారిని ఎంపీలుగా చేశానని అన్నారు. తాను ఒక్క పదవిని కూడా ఆశించలేదని, రాష్ట్ర సమస్యలు పరిష్కరించాలని కోరడమే తన తప్పియిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని, విభజన డిమాండ్లను, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతుంటే, బీజేపీ కాదని చెబుతూ ఎదురుదాడికి దిగిందని, ఇబ్బందులపాలు జేస్తోందని అన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తనకు బాధేస్తోందని, చేయని తప్పుకు ఏపీ ప్రజలు శిక్షను అనుభవిస్తున్నారని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు.

More Telugu News