Chandrababu: జగన్ పోరాటాలను చంద్రబాబు హేళన చేశారు: శ్రీకాంత్ రెడ్డి

  • చంద్రబాబు కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు
  • అప్పుడు ప్యాకేజీ అని.. ఇప్పుడు కొత్త డ్రామా మొదలెట్టారు
  • బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని వైసీపీ ఎంపీ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గత నాలుగేళ్లుగా ఏపీ ప్రజలను మోసం చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని చంద్రబాబు ఎందుకు అనలేదని చెప్పారు.

హోదాపై తమ అధినేత జగన్ చేసిన అలుపెరుగని పోరాటాన్ని కూడా చంద్రబాబు హేళన చేశారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ అప్పుడు డ్రామాలాడి... ఇప్పుడు మాట మార్చారని ఎద్దేవా చేశారు. క్రెడిట్ మొత్తం వైసీపీకి వస్తుందనే భయంతో... కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైసీపీ మద్దతు ఇస్తుందనే విషయాన్ని తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పిన బీజేపీతో కలసి తాము వెళ్లబోమని చెప్పారు. 

More Telugu News