Chandrababu: చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు: కిషన్ రెడ్డి

  • జగన్, పవన్ లను బీజేపీ రెచ్చగొడుతోందని చంద్రబాబు అంటున్నారు
  • అలాంటి అవసరం బీజేపీకి లేదు
  • దేశంలో ఎలాంటి ఫ్రంట్ కు అవకాశం లేదు

ఇతర పార్టీలు పెట్టే అవిశ్వాస తీర్మానాలకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు నిలదీస్తే... వారిద్దరినీ బీజేపీ రెచ్చగొట్టిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం భావ్యం కాదని చెప్పారు. ఎవరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ అనుకూల గాలి వీస్తోందని... ఎలాంటి ఫ్రంట్ కు అవకాశం లేదని చెప్పారు.

ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం గొప్పలకు పోయి, బడ్జెట్ లో ఎక్కువ లెక్కలు చూపుతోందని విమర్శించారు. బడ్జెట్ కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ కోసం 5 శాతం నిధులను కూడా కేటాయించలేదని అన్నారు. యూనివర్శిటీలపై ప్రభుత్వం కక్ష కట్టిందని... ఉస్మానియా యూనివర్శిటీలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు.

More Telugu News