Pawan Kalyan: పవన్ కల్యాణ్ .. మోకాలుకి బోడిగుండుకి ముడిపెట్టాలని చూడకు !: ఎమ్మెల్యే బోండా ఉమ

  • నెల రోజుల్లోనే పవన్ కల్యాణ్ అభిప్రాయం ఎందుకు మారిందో?
  • శేఖర్ రెడ్డికి, లోకేశ్ కు అసలు సంబంధమేమైనా ఉందా?
  • పవన్ ఆరోపణలు నమ్మేందుకు ప్రజలేమీ అమాయకులు కాదు
  • మీడియాతో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ

ఒక సమర్థుడైన చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని నెల రోజుల క్రితం పేర్కొన్న పవన్ కల్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నెల రోజుల్లోనే పవన్ కల్యాణ్ అభిప్రాయం ఎందుకు మారిందో ఎవరికీ అర్థం కావట్లేదని, ఏపీ ప్రజలకు కూడా అర్థం కానటువంటి అంశమిదని అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ పై పవన్ చేసిన ఆరోపణలను ఉమ ప్రస్తావించారు. శేఖర్ రెడ్డికి, లోకేశ్ కు అసలు సంబంధమేమైనా ఉందా? ఇందుకు సంబంధించిన ఆధారాలేమైనా మీ దగ్గర ఉన్నాయా? అని ప్రశ్నించారు. ‘శేఖర్ రెడ్డి కేసులో లోకేశ్ గారు ముద్దాయి..అందుకుని, ఏపీకి ప్రధాని మోదీ సహాయం చెయ్యట్లేదు’ అని పవన్ కల్యాణ్ మాట్లాడారని, ఈ విషయాన్ని పవన్ కు మోదీ చెప్పారా? అమిత్ షా చెప్పారా? అని ఉమ ప్రశ్నించారు. ఈ విషయాన్ని పవన్ కు ఎవరు చెప్పారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు నమ్మేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలేమీ అమాయకులు కారని, మోకాలుకి బోడిగుండుకి ముడిపెట్టాలని చూస్తున్న పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఉమ హితవు పలికారు.

More Telugu News