Rape: టెన్త్ చదువుతున్నప్పుడే అమ్మాయి నగ్న చిత్రాలు తీసి... పెళ్లయినా వదలని కామాంధుడు... షీ టీమ్స్ చేతికి చిక్కి జైలుకు!

  • బాధితురాలితో కలసి పదో తరగతి చదివిన నిందితుడు
  • అప్పుడే ఫోటోలు తీసి పెట్టుకున్న కామాంధుడు
  • నిత్యమూ వేధింపులు, ఆపై ఒంటరిగా రమ్మని అత్యాచారం
  • రంగంలోకి దిగిన పోలీసులు - జైలుకు

కలసి చదువుకునే రోజుల్లో ఓ బాలిక నగ్న చిత్రాలను సేకరించి, ఆపై ఆమెకు పెళ్లయి ఇద్దరు బిడ్డల తల్లయినా కూడా వదిలిపెట్టకుండా అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడిని షీ టీమ్స్ పోలీసులు నిర్భయ చట్టం సాయంతో జైలుకు పంపారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, గోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన రెడ్డిపోగు రవి (31) కల్వకుర్తిలో పదో తరగతి చదివాడు. ఆ సమయంలో తనతో చదువుకునే ఓ బాలికతో చనువుగా ఉండే ప్రయత్నం చేయగా, ఆమె నిరాకరించింది. ఆపై విద్యాభ్యాసం తరువాత ఇద్దరూ విడిపోయారు. 2014లో ఆమెకు వివాహం కాగా, ఇద్దరు పిల్లలు, భర్తతో కలసి బడంగ్ పేటలో నివాసం ఉంటోంది.

ఈ క్రమంలో గత సంవత్సరం ఆమె ఫోన్ నంబర్ సంపాదించిన రవి, నిత్యమూ ఫోన్ చేసి వేధించడం ప్రారంభించాడు. టెన్త్ చదివే సమయంలో ఆమెకు తెలీకుండా తీసిన నగ్న దృశ్యాలను ఫోన్ కు పంపి, వాటిని భర్తకు కూడా పంపుతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళనతో ఆమె రవి ఫోన్ నంబర్ ను బ్లాక్ చేయగా, మరో నంబర్ తో వేధింపులు కొనసాగించాడు. తొలుత డబ్బులిస్తే ఫోటోలు తీసేస్తానని చెప్పి రూ. 2.50 లక్షలు నొక్కేసిన రవి, ఆపై శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చాడు. తనవద్దకు రాకుంటే భర్తను చంపిస్తానని, పిల్లలను కిడ్నాప్ చేస్తానని బెదిరింపులకు దిగాడు.

ఇక జనవరి 18న ఒక్కసారి తన వద్దకు రావాలని కల్వకుర్తిలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు వస్తే, ఫోటోలన్నీ ఆమె ముందే డిలీట్ చేస్తానని నమ్మబలికితే, ఆమె వెళ్లింది. మాయమాటలు చెప్పిన ఆమెను, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై కూడా ఫోటోలు డిలీట్ చేయకుండా వేధిస్తుంటే, బాధితురాలు షీ టీమ్స్ ను ఆశ్రయించింది. దీంతో రవిని మంగళవారం నాడు అరెస్ట్ చేసిన పోలీసులు, సదరు ఫోన్ ను స్వాధీనం చేసుకుని ఆ కామాంధుడిని జైలుకు పంపారు.

More Telugu News