Telangana: హెడ్ ఫోన్స్ రాజకీయం... ఇద్దరి పదవులు పోయాయ్... 11 మంది అసెంబ్లీ సమావేశాలకు రాలేరు!

  • కఠిన శిక్షలు విధించిన తెలంగాణ అసెంబ్లీ
  • హెడ్ ఫోన్స్ స్వామిగౌడ్ కు తగిలాయని నిరూపించాలన్న కోమటిరెడ్డి
  • ఈ ఉదయం రెండు తీర్మానాలు ప్రవేశపెట్టిన హరీశ్ రావు
  • రెండింటినీ ఆమోదించిన అసెంబ్లీ

తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న వేళ, కాంగ్రెస్ సభ్యుల నిరసనలపై టీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగలడంతో ఆయన కంటి కార్నియాకు గాయమైన సంగతి తెలిసిందే. దీనిపై అత్యంత తీవ్రంగా వ్యవహరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరి శాసన సభ్యత్వాలను రద్దు చేయడంతో పాటు, 11 మందిని అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకూ సభ నుంచి బహిష్కరించింది. తాను హెడ్ ఫోన్స్ ను ఎవరి టార్గెట్ గానో విసరలేదని, తాను విసిరిన హెడ్ ఫోన్స్ స్వామిగౌడ్ కు తగిలినట్టు సాక్ష్యం చూపితే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కోమటిరెడ్డి వెల్లడించినా, టీఆర్ఎస్ పట్టించుకోలేదు. స్వామిగౌడ్ కు హెడ్ ఫోన్స్ తగులుతున్న దృశ్యాలు ఎక్కడా విడుదల కాలేదు.

ఇక ఈ ఉదయం సభ ప్రారంభమైన తరువాత తొలుత 11 మంది సభ్యులను ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన శాసన సభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు, ఆపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తీర్మానాన్ని సభ ముందుంచారు. ఈ రెండు తీర్మానాలనూ సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ, సభ సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. తాను గవర్నర్ ను టార్గెట్ చేయబోతే, హెడ్ ఫోన్స్ గురితప్పి స్వామిగౌడ్ ను తగిలాయని కోమటిరెడ్డి చెప్పడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. ఇటువంటి వ్యక్తులు సభలో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

More Telugu News