Sri Venkateswara College: మద్యం మత్తులో యువతి డ్రైవింగ్...ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

  • కారులోని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
  • డ్రైవింగ్ చేస్తున్న యువతి మద్యం సేవించిందన్న డీసీపీ
  • ఈ రోజు తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో ఘటన

వాయువ్య ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఓ యువతి కారు నడపడంతో అందులోని ఇద్దరు స్టూడెంట్లు దుర్మరణం చెందారు. డ్రైవర్ సహా ముగ్గురు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున 2.45 గంటలకు సంభవించిన ఈ దుర్ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే, మద్యం మత్తులో ఉన్న యువతి కారుపై నియంత్రణ కోల్పోయింది. దాంతో హడ్సన్ లైన్స్‌ వద్ద ఉన్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఇద్దరు స్టూడెంట్లు రితేశ్ దహియా, సిద్దార్థ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

 కారులోని డ్రైవర్ సహా ముగ్గురు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత కారు రెండు పల్టీలు కొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న యువతి మద్యం మత్తులో ఉన్నట్లు డీసీపీ (వాయువ్య ఢిల్లీ) అస్లాం ఖాన్ తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం నిందితురాలిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. కారు దహియా తండ్రిది. ఈ ప్రమాదానికి కారకురాలైన యువతికి లెర్నర్ లైసెన్స్ ఉంది. వారంతా నోయిడాలోని అమితీలో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దహియా శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థి కాగా, సిద్ధార్థ్ మహారాజా సూరజ్‌మాల్ శిక్షా సంస్థాన్ విద్యార్థి. మిగిలిన ముగ్గురు యువతులు నోయిడాలోని అమితీ యూనివర్శిటీ విద్యార్థులు.

More Telugu News