MPs: దేశంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న చట్టసభ్యులెందరో తెలుసా?

  • దేశవ్యాప్తంగా 1700 మందికి పైగా చట్టసభ్యులపై క్రిమినల్ కేసులు
  • టాప్‌లో యూపీ..తర్వాతి స్థానాల్లో తమిళనాడు, బీహార్, ప.బెంగాల్
  • పెండింగ్‌లోనే 3045 క్రిమినల్ కేసులు

దేశవ్యాప్తంగా దాదాపు 1700 మందికి పైగా సిట్టింగ్ ఎంపీలు, ఎంఎల్ఏలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ టాప్‌లో ఉంది. ఆ రాష్ట్రంలో 248 మంది ఎంపీలు, ఎంఎల్ఏలు విచారణను ఎదుర్కొంటున్నారు. యూపీ తర్వాతి స్థానాలను వరుసగా తమిళనాడు (178), బీహార్ (144), పశ్చిమ్ బెంగాల్ (139) రాష్ట్రాలు ఆక్రమించాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనూ వంద మందికి పైగా ఎంపీలు, ఎంఎల్ఏలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, 2014-2017 మధ్యకాలంలో 1765 మంది చట్టసభ్యులు (ఎంపీలు, ఎంఎల్ఏలు) 3816 క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

ఈ 3816 కేసుల్లో, ఒక్క ఏడాదిలోపల 125 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఇలాంటి కేసులను ఏడాదిలోగా పరిష్కరించాలి. అయితే పెండింగ్ కేసులకు సంబంధించిన తాజా గణాంకాలు కోర్టు తీర్పును బేఖాతరు చేసినట్లు అర్థమవుతోంది. గత మూడేళ్ల కాలంలో 771 కేసుల విచారణ పూర్తయింది. మరో 3045 కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గతేడాది డిసెంబరులో జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశం మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని అందజేసింది. 

More Telugu News