kotamreddy sridhar reddy: నా కుమార్తె గర్భిణి.. ఇంత దుర్మార్గమా?: మీడియా ముందు కంటతడి పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

  • విచారణకు సహకరిస్తున్నా... తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • అజ్ఞాతంలోకి వెళ్లానంటూ ఓఎస్డీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు
  • గర్భవతి అయిన నా కూతురు భయపడిపోతోంది

క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణకు తాను సహకరిస్తున్నా... తాను అజ్ఞాతంలో ఉన్నానని, తనను అరెస్ట్ చేస్తామంటూ లీకులు ఇస్తూ పోలీసులు తన కుటుంబసభ్యుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కంటతడి పెట్టారు. క్రైమ్ ఓఎస్డీ విఠలేశ్వర్ మీడియాకు ఇస్తున్న లీకుల వల్ల తన కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ పేరు చెప్పుకుని విఠలేశ్వర్ దుర్మార్గానికి ఒడిగడుతున్నారని మండిపడ్డారు. తనకు నోటీసులు వచ్చినప్పుడు తాను నెల్లూరులోనే ఉన్నానని చెప్పారు. 'శ్రీధర్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, ఏ క్షణంలోనైనా అరెస్ట్' అనే బ్రేకింగ్ న్యూస్ లు ఛానల్స్ లో వచ్చాయని... ఈ లీకులన్నీ ఇచ్చింది ఓఎస్డీనే అని ఆరోపించారు.

ఈ వార్తలతో బెంగళూరులో ఉన్న తన కుమార్తె భయపడిపోయిందని... వెంటనే బెంగళూరు రావాలంటూ తనను కోరిందని కోటంరెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి అని తెలిపారు. కొద్ది రోజుల్లో డెలివరీ కావాల్సిన తన కుమార్తె ఏడుస్తుంటే... తన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పానని, ఏడుస్తున్న తన కూతురుని చూసి మళ్లీ వస్తానని చెప్పి బెంగళూరుకు వెళ్లానని... అయితే మీడియాకు విఠలేశ్వర్ ఫోన్ చేసి, తాను అజ్ఞాతంలోకి వెళ్లానంటూ దుర్మార్గపు ప్రచారం చేశారని చెప్పారు. అరెస్ట్ చేస్తామనే భయంతోనే, శ్రీధర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారానికి తెరతీశారని మండిపడ్డారు.

More Telugu News