Telangana: తెలంగాణ స్కూలు విద్యార్థులకు శుభవార్త

  • విద్యార్థులకు వారానికి ఇకపై ఆరు గుడ్లు
  • ఇప్పటివరకు అందిస్తున్న దానికి రెట్టింపుకు యోచన
  • 7-10 తరగతి విద్యార్థినులకు ఆరోగ్య, పరిశుభ్ర కిట్ల పంపిణీకి యోచన చేస్తున్నట్లు మంత్రి కడియం వెల్లడి

విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై వారానికి ఆరు గుడ్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు విద్యార్థులకు వారానికి మూడు గుడ్లను మాత్రమే అందిస్తున్నారు. ఈ పరిమాణాన్ని రెండింతలు చేయనున్నారు. నిన్న జరిగిన ప్రధానోపాధ్యాయుల సదస్సులో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 23 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకానికి గాను ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు.

ఇప్పటివరకు అందిస్తున్న ఆహార పరిమాణాన్ని పెంచడానికి ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు. ఒక్కో విద్యార్థికి ఇప్పటివరకు వారానికి మూడు గుడ్లను అందిస్తుండగా దీనిని రెండింతలు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించామని కడియం చెప్పారు. మరోవైపు 7-10 తరగతి విద్యార్థినులకు ఆరోగ్య, పరిశుభ్ర కిట్‌లను కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. అంతేకాక మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సదుపాయం లేని స్కూళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కూడా సంబంధిత అధికారులను ఆదేశించామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

More Telugu News