rahul dravid: ఆ అకాడమీ నుంచి ఏ రకమైన ప్రయోజనాలు పొందడం లేదు: రాహుల్ ద్రవిడ్ స్పష్టీకరణ

  • పరస్పర ప్రయోజనాల అంశంపై బీసీసీఐకి లేఖ రాసిన రాహుల్ ద్రవిడ్
  • బెంగళూరులో నిర్మితమైన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌ అకాడమీకి పదుకొణే-ద్రవిడ్ పేరు
  • తనకు ఆ సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని తెలిపిన ద్రవిడ్

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తన నిజాయతీని మరోసారి నిరూపించుకున్నాడు. 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల' అంశంలో తనపై మరో వివాదం రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా బెంగళూరులో నిర్మితమైన పదుకొణే-ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌ పై బీసీసీఐకి స్పష్టమైన సమాచారం అందించాడు. బెంగళూరులో నిర్మితమైన పదుకొణే-ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌ అకాడమీలో బ్యాడ్మింటన్, క్రికెట్, టెన్నిస్, స్వాష్, ఫుట్‌బాల్, స్మిమ్మింగ్‌ నేర్పిస్తారని తెలిపాడు. ఈ అకాడమీకి ప్రకాశ్ పదుకునే పేరు వాడుకున్నట్టే తన పేరును కూడా వాడుకున్నారని, దాని ద్వారా తాను ఏ రకమైన ప్రయోజనాలు పొందడం లేదని స్పష్టం చేశాడు.

 ఆ సంస్థలో కానీ, ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. గత వరల్డ్ కప్ టూర్ కు బయల్దేరకముందే ద్రవిడ్ బీసీసీఐకి దీనిపై స్పష్టమైన సమాచారంతో లేఖ రాసినట్టు బీసీసీఐ అధికారి తెలిపారు. ద్రవిడ్ సమాచారం ఇచ్చాడని నిర్ధారించిన బీసీసీఐ, ఈ విషయంలో ద్రవిడ్‌ కు ఎలాంటి సమస్యలేదని పేర్కొంది.  

కాగా, గతంలో ఐపీఎల్‌ లో ఒక ఫ్రాంఛైజీకి మెంటార్‌ గా వ్యవహరిస్తూ టీమిండియా-ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా కొనసాగుతూ, క్రికెట్ లో పరస్పర ప్రయోజనాల నిబంధనను ద్రవిడ్ ఉల్లంఘించాడంటూ వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ జట్టు బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 

More Telugu News