BJP: బీజేపీ కూడా తగ్గడం లేదు... లెక్కలు తీస్తున్న నేతలు!

  • ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందంటున్న టీడీపీ
  • ఎప్పటికప్పుడు నిధులు అందుతూనే ఉన్నాయన్న బీజేపీ
  • గణాంకాలు సేకరిస్తున్న బీజేపీ నేతలు
  • ఇచ్చిన డబ్బుకు లెక్కలు అడిగే ఆలోచనలో బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ఇస్తామన్న ప్యాకేజీ కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించిన టీడీపీ అధిష్ఠానం వైఖరిని ఎండగట్టేందుకు బీజేపీ నేతలు కదిలారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయంపై లెక్కలు తీసి, ఆ డబ్బును ఎక్కడ, ఎలా వినియోగించారో చంద్రబాబు సర్కారును నిలదీయాలని, ఆయన తీరును ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలని భావిస్తున్న బీజేపీ, గడచిన నాలుగేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను బయటకు తీస్తోంది.

రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులతో పాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు, రెవెన్యూ లోటు భర్తీకి ఇచ్చిన డబ్బు వివరాలు సేకరించి, వాటిని ప్రజల ముందుంచాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇచ్చిన డబ్బుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నడూ లెక్క చెప్పలేదని ఇప్పటికే విమర్శించిన ఆ పార్టీ నేతలు, డీపీఆర్ లు సమర్పించని రాష్ట్రానికి మరిన్ని నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ఎప్పటికప్పుడు నిధులు వస్తూనే ఉన్నాయని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

More Telugu News