BJP: విగ్రహం ధ్వంసమా? ఎక్కడ?... లెనిన్ విగ్రహాన్ని పెట్టిన వాళ్లే కూల్చేశారన్న రాంమాధవ్

  • ప్రైవేటు భూమిలో విగ్రహం
  • ప్రతిష్ఠించిన వారే కూల్చేశారు
  • విగ్రహాల విధ్వంసం ఎక్కడా లేదు
  • బీజేపీ నేత రాంమాధవ్

త్రిపురలో విగ్రహాల విధ్వంసం అన్నది ఎక్కడా జరగలేదని బీజేపీ అధికార ప్రతినిధి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. బెలోనియాలో లెనిన్‌ విగ్రహాన్ని కూల్చిన ఘటనపై ఆయన స్పందిస్తూ, దీన్ని ఎవరూ కూల్చివేయలేదని, ప్రైవేట్‌ భూమిలో ఇది ఏర్పాటై ఉండటంతో ఈ విగ్రహాన్ని భూ యజమానులే తొలగించారని, ఆ విగ్రహాన్ని గతంలో వాళ్లే ప్రతిష్ఠించుకున్నారని వెల్లడించారు.

మీడియాలో జరిగిన ప్రచారం తప్పుడుదని అన్నారు. అంతర్జాతీయ నేతలను గౌరవించాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హితవు పలకడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నేతలను ఎలా గౌరవించాలో తమకు తెలుసునని, ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో తలదూర్చేముందు సొంత రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుకోవాలని అన్నారు. కాగా, త్రిపురలో 25 ఏళ్ల తరువాత వామపక్ష పార్టీల ప్రభుత్వాన్ని బీజేపీ గద్దెదింపిన తరువాత విగ్రహాల విధ్వంసం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News