Sridevi: తల్లి దూరమైన బాధను దిగమింగి... షూటింగ్ కు వచ్చేసిన జాన్వీ కపూర్

  • 'ధడక్' షూటింగ్ తిరిగి మొదలు
  • అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తి
  • సహకరిస్తానని చెప్పిన జాన్వీ కపూర్

అందాలతార శ్రీదేవి వారసురాలిగా త్వరలో వెండితెరపైకి రానున్న జాన్వీ కపూర్, తన తొలి చిత్రం 'ధడక్' షూటింగ్ కు తిరిగి వచ్చింది. తల్లి మరణించిన 10 రోజుల తరువాత, ఆ బాధను మనసులోనే దిగమింగిన జాన్వీ, సినిమా షూటింగ్ లో జాయిన్ కాగా, ఆ చిత్రాలను యూనిట్ అభిమానులతో పంచుకుంటూ, చేసే పనిపై జాన్వీ చూపిన శ్రద్ధను మెచ్చుకుంది. రెండు రోజుల క్రితం తన 21వ పుట్టిన రోజును జరుపుకున్న జాన్వీ, సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిందట.

కాగా, 'ధడక్' ప్రస్తుత షెడ్యూల్ లో భాగంగా బాంద్రా ప్రాంతంలో జాన్వీ, ఈషాన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం నుంచి వీరిద్దరూ కోల్ కతాలో జరిగే షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సూపర్ హిట్ అయిన మరాఠీ చిత్రం 'సైరాత్' హిందీ రీమేక్ గా ఈ చిత్రం తయారవుతున్న సంగతి తెలిసిందే. సైరాత్ ఇంటర్వెల్ తరువాత కనిపించే హైదరాబాద్ దృశ్యాలు... హిందీలో కోల్ కతా నగరంలో షూట్ చేయనున్నారు.

More Telugu News