mahammad shami: షమీ నన్ను మోసం చేశాడు... దేశాన్ని కూడా మోసం చెయ్యగలడు: భార్య సంచలన ఆరోపణలు

  • పాకిస్థాన్ మహిళతో షమీకి సంబంధాలు
  • పాక్ మహిళ షమీకి డబ్బులు కూడా ఇచ్చింది
  • ఆరోపణలన్నింటికీ సాక్ష్యాలున్నాయి

టీమిండియా పేసర్‌  మహమ్మద్‌ షమీపై అతని భార్య హసీన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. కోల్ కతాలో పోలీస్ కమిషనర్ కు షమీపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, పాకిస్థాన్‌ కు చెందిన అలీష్ బా తనకు డబ్బిచ్చిందని షమి తనకు చెప్పాడని, అయితే ఆమె ఎందుకు ఇచ్చిందన్న సంగతి తనకు తెలియదని పేర్కొంది.

తనను మోసం చేసిన షమీ దేశాన్నీ మోసం చేయగలడని పేర్కొంది. పాకిస్థాన్ మహిళతో సంబంధాలు ఉన్నాయనేందుకు తన దగ్గర తగిన ఆధారాలున్నాయని ఆమె చెప్పింది. దుబాయ్‌ లో వారు బస చేసిన హోటల్‌ కు వెళ్తే అతడు గది తీసుకున్నాడా? లేదా? అన్నది తేలిపోతుందని చెప్పిన హసీన్ జహాన్, ఆమె నుంచి తాను డబ్బులు స్వీకరించానంటూ షమీ చెప్పిన రికార్డింగ్ తన వద్ద ఉందని తెలిపింది.

 2012లో తాను షమీని తొలిసారి కలిశానని, అంతకుముందు షమీ తన సమీప బంధువుల్లో ఒక అమ్మాయిని ఐదు సంవత్సరాల పాటు గాఢంగా ప్రేమించాడని చెప్పింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నప్పటికీ అమ్మాయి కుటుంబ సభ్యులు అతనితో వివాహానికి అంగీకరించలేదని, దీంతో షమీ ఆత్మహత్యాయత్నం కూడా చేశాడని చెప్పింది.

షమీ కోసం తాను మోడలింగ్ కెరీర్, జాబ్ అన్నీ వదులుకున్నానని చెప్పింది. సఫారీ టూర్ నుంచి వచ్చినప్పటి నుంచి తనను వదిలించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాడని ఆమె ఆరోపించింది. ఆస్తులు, బీమాకు సంబంధించిన పత్రాలన్నీ తీసేసుకున్నాడని తెలిపింది. విడాకులు కావాలని వేధిస్తున్నాడని పేర్కొంది. తన ఊపిరి ఉన్నంత వరకూ షమీకి విడాకులివ్వనని హసీన్ జహాన్ స్పష్టం చేసింది. తన ఆరోపణలన్నింటికీ సాక్ష్యాలున్నాయని ఆమె వెల్లడించింది. 

More Telugu News