Telugudesam: అశాస్త్రీయంగా విభజన జరిగిందని రాష్ట్ర విభజన చేసిన వాళ్లే అంటున్నారు : అశోక్ గజపతిరాజు

  • జాతీయ పార్టీలన్నీ కలిసి ఏపీని విభజించాయి
  • విభజనప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
  • ఏపీ అభివృద్ధికి చంద్రబాబు బాగా కష్టపడుతున్నారు
  • దేశంలో అందరూ బాగుపడితేనే కదా, దేశం బాగుపడేది : అశోక్ గజపతిరాజు

రాష్ట్రవిభజన చేసే వాళ్లే  అశాస్త్రీయంగా విభజన జరిగిందని అంటున్నారని కేంద్ర మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని ప్రతిఒక్కరూ అంటున్నారని అన్నారు. జాతీయ పార్టీలన్నీ కలిసి ఏపీని విభజించాయని, అశాస్త్రీయంగా జరిగిన ఈ విభజన గురించి మాట్లాడాల్సిన బాధ్యత దేశంలోని జాతీయ పార్టీలన్నింటికీ ఉందని, ఈ విషయాన్ని గుర్తు చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు.

విభజనప్పుడు ఏయే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఏపీకి సాయం చేసే విషయంలో కేంద్రం ఎందుకు వెనుకంజ వేస్తుందనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఈ విషయమై తామేమీ ఊహించదలచుకోలేదని, ఏపీ అభివృద్ధికి చంద్రబాబునాయుడు బాగా కష్టపడుతున్నారని, కేంద్రం సహకరిస్తే ఏపీ నిలదొక్కుకుంటుందని అన్నారు. ‘దేశంలో అందరూ బాగుపడితేనే కదా, దేశం బాగుపడేది. ‘దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్’ అని మా గురజాడ అన్నారు కదా. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని కేంద్రానికి అశోక్ గజపతి రాజు సూచించారు.

More Telugu News