Tamilnadu: హెల్మెట్ ధరించని బైక్ ను ఛేజ్ చేసిన పోలీసులు... కిందపడి యువతి మృతి!

  • తమిళనాడులో యువతి ప్రాణాలు తీసిన పోలీసు అత్యుత్సాహం
  • బండిని ఆపలేదని వెంటపడి ఢీ కొట్టిన ట్రాఫిక్ పోలీసు
  • ప్రమాదంలో యువతి మృతి, స్థానికుల ఆగ్రహం

తన భర్తతో కలసి బైక్ పై వెళుతున్న ఓ యువతి, పోలీసుల అత్యుత్సాహం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి తిరువెరుంబూరు చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్న పోలీసులు, రాజా అనే యువకుడు, ఆయన భార్య వస్తున్న బైక్ ను ఆపేందుకు ప్రయత్నించారు. తలపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న రాజా, బైక్ ను ఆపకుండా ముందుకు వెళ్లగా, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కామరాజ్ వారి వెనుక పడ్డాడు.

ఈ క్రమంలో రాజా అదుపు తప్పి కిందపడగా, వెనక కూర్చున్న ఆయన భార్య దుర్మరణం పాలైంది. మద్యం తాగి ఉన్న ఇన్ స్పెక్టర్ తన వాహనంతో రాజా బైక్ ను ఢీకొట్టాడని కొందరు స్థానికులు ఆరోపించారు. ఇదే సమయంలో కిందపడ్డ ఆమెపై నుంచి మరో వాహనం వెళ్లినట్టు కనిపించిందని మరికొందరు చెప్పారు. ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, సదరు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News