Goa: మెరుగైన చికిత్స కోసం నేడు అమెరికాకు వెళ్లనున్న గోవా సీఎం

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్
  • ఇప్పటికే రెండుసార్లు ముంబై ఆసుపత్రిలో చేరిన సీఎం
  • అమెరికా వెళ్తున్నట్టు గవర్నర్‌కు లేఖ

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (62) మెరుగైన చికిత్స కోసం నేడు అమెరికా వెళ్లనున్నారు. ఈ మేరకు గోవా గవర్నర్ మృదుల్ సిన్హాకు పారికర్ లేఖ రాశారు. మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్టు తెలిపారు. ముంబై, గోవా వైద్య నిపుణుల సూచన మేరకు తాను గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

స్వల్ప అస్వస్థత కారణంగా గత నెల 15న పారికర్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు అక్కడ చికిత్స అందించిన వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లాల్సిందిగా సూచించారు.  ఫిబ్రవరి 22న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఎం మూడు రోజుల తర్వాత మరోమారు ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి.

చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్న సీఎం పారికర్ గోవా ప్రజలను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు. తన కోసం గత 15 రోజులుగా ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి దీవెనల వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్న ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్నారు.

More Telugu News