PNB: పీఎన్బీ కేసులో భారీ ట్విస్ట్... ఐసీఐసీఐ చైర్మన్ చంద కొచ్చర్, యాక్సిస్ ఎండీ శిఖా శర్మకు సమన్లు

  • బ్యాంకింగ్ రంగ పరువు తీసిన పీఎన్బీ
  • ఎల్ఓయూలు తీసుకుని అప్పనంగా రుణాలిచ్చిన ఐసీఐసీఐ, యాక్సిస్
  • విచారణకు రావాలని సీబీఐ నోటీసులు
  • మరిన్ని ప్రైవేటు బ్యాంకు ఉన్నతాధికారులకు కూడా!

భారత దేశ బ్యాంకింగ్ రంగ పరువును తీసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, నీరవ్ మోదీ వ్యవహారంలో ఈ ఉదయం భారీ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరుపుతున్న సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ చంద కొచ్చర్ కు సమన్లు జారీ చేశారు. ఆమెను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మను కూడా విచారణకు పిలిచారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఎల్ఓయూ (లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్) తీసుకుని నీరవ్ కు ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర 15కు పైగా బ్యాంకులు, ముందూ వెనుకా చూడకుండా అప్పనంగా రుణాలిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ స్కామ్ లో ఇప్పటివరకూ 16 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడీ స్కామ్ లో టాప్ బ్యాంకర్స్ ను సైతం ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించడం కలకలం రేపుతోంది. వీరిద్దరితో పాటు పలు ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలూ కూడా నోటీసులు అందుకోనున్నారని సమాచారం.

More Telugu News