NTR: తల్లిదండ్రుల స్వగ్రామాల్లో బాలయ్య పర్యటన

  • 29న రామకృష్ణా స్టూడియోలో ఎన్టీఆర్ షూటింగ్ మొదలు
  • మే నుంచి రెగ్యులర్ షూటింగ్
  • నిమ్మకూరు, కొమరవోలులో బాలకృష్ణ పర్యటన
  • బంధువులను చిత్ర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం

హైదరాబాద్ లోని రామకృష్ణా స్టూడియోస్ లో ఈనెల 29న ప్రారంభం కానున్న ఎన్టీ రామారావు జీవిత చరిత్ర సినిమా 'ఎన్టీఆర్' ప్రారంభోత్సవానికి రావాలని తన తల్లి తరఫు బంధువులను బాలకృష్ణ ఆహ్వానించారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలో పర్యటించిన ఆయన, నందమూరి బసవతారకం స్వగ్రామమైన కొమరవోలు గ్రామానికి వెళ్లారు. అక్కడి ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సినిమా ముుహూర్తం సమయానికి హైదరాబాద్ రావాలని అక్కడున్న బంధుమిత్రుల కుటుంబాలకు స్వయంగా ఆహ్వానం పలికారు. ఆపై ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు చేరుకున్న ఆయన, గ్రామంలోని బంధువులతో సమావేశమై, వారిని కూడా రామకృష్ణా స్టూడియోస్ కు రావాలని, తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దైవ కృపతోనే తనకు ఈ చిత్రం చేయాలన్న తలంపు వచ్చిందని అన్నారు. 29న లాంఛనంగా షూటింగ్ ను ప్రారంభిస్తామని, ఆపై మే నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిపి, సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. 

More Telugu News