somireddy: కేంద్రం కొనగా మిగిలిన పంటను మేమే కొంటాం: ఏపీ మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి

  • వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులతో మంత్రుల సమీక్షా సమావేశం
  • కంది రైతులను ఆదుకుంటాం 
  • కేంద్ర సర్కారు నాఫెడ్ ద్వారా 45 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుంది

రాష్ట్రంలోని కంది రైతులను ఆదుకోవ‌డానికి త‌మ‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆది నారాయణరెడ్డి అన్నారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆది నారాయణ రెడ్డి... వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రంలో కందుల దిగుబడి భారీగా పెరిగిందన్నారు.

కంది రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో, పంటనంతా కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా 45 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి తెలిపారు. మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులకు భరోసా ఇవ్వనుందన్నారు.

మొదటగా ప్రతి రైతు నుంచి 25 క్వింటాళ్ల‌ చొప్పున కందులు కొనుగోలు చేస్తామన్నారు. మిగిలిన పంట ఎంత ఉందో లెక్కించి, ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ, మార్కెటింగ్ కమిషనర్లు హరి జవహర్ లాల్, శామ్యూల్ ఆనంద్, మార్క్ ఫెడ్ ఎండీ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

More Telugu News