Poison: మంత్రగాడి సాయంతో భర్తను కడతేర్చిన భార్య..!

  • మంత్రగాడిచ్చిన విషంతో భర్తపై ప్రయోగం
  • అతనితో వైవాహిక జీవితం సుఖంగా లేదన్న నిందితురాలు
  • చేసిన నేరానికి అరదండాలు...మంత్రగాడు కూడా అరెస్ట్

మంత్రగాడి మాటలు నమ్మి ఓ మహిళ తన భర్తకు విషమిచ్చి చంపింది. విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు ప్రధాన నిందితురాలిని, ఆమెకు సాయపడిన మంత్రగాడు శ్యామ్ సింగ్ అలియాస్ భగత్ సింగ్‌ని అరెస్టు చేశారు. తన భర్తను తానే చంపుకున్నట్లు నిందితురాలు కేవీ రమ పోలీసుల విచారణలో అంగీకరించింది. వివరాల్లోకెళితే...ఫిబ్రవరి 26న ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య తమ ఆసుపత్రిలో చేరాడని, చికిత్స పొందుతూ మరణించాడని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుంచి ఢిల్లీ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మృతుడిని డీ.శ్రీనివాస్ మూర్తిగా గుర్తించారు. తప్పుడు వివరాలతో అతన్ని నిందితురాలు ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు.

ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలు వచ్చిన కారు తాలూకూ నంబరు సాయంతో కలిబరిలోని ఆమె ఇంటికి వెళ్లామని పోలీసులు తెలిపారు. తమ విచారణలో ఈ నేరం తానే చేసినట్లు ఆమె అంగీకరించిందని వారు చెప్పారు. మంత్రగాడు ఇచ్చిన విషంతోనే తన భర్తను చంపానని ఆమె తెలిపింది. తన భర్త తాగుడుకు బానిసయ్యాడని, అతనితో తన వైవాహిక జీవితం అంత సుఖంగా లేదని, అంతేకాక తన కుటుంబం రూ.10-12 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయిందని కూడా ఆమె వివరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హతుడి సోదరుడిని కూడా పోలీసులు విచారించారు. నిందితురాలిపై ఐపీసీలోని 302, 120బీ, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News